గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా రాజుగౌడ్
August 27, 2022
dharshininews
గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా రాజుగౌడ్
- మురళీగౌడ్కు షాకిచ్చిన సర్కారు
- జీవో 88ను జారీ చేసిన విద్యాశాఖ
తాండూరు, దర్శిని ప్రతినిధి: వికారాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ నూతన చైర్మన్గా టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత రాజుగౌడ్ (సుశీల్ కుమార్ గౌడ్ ) నియామకం అయ్యారు. ఈ మేరకు విద్యాశాఖ శనివారం జీవో 88ను జారీ చేసింది. గత ఏడాది మార్చిలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పదవిని ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి తాండూరుకే చెందిన మురళీకృష్ణ గౌడ్కు ఇప్పించారు. కొద్దికాలంగా ఎమ్మెల్యే రోహిత్ రెడ్డితో మురళీగౌడ్ దూరంగా ఉంటున్నారు. దీంతో ఆయనను తప్పించాలని ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిపై వత్తిడి పెరిగింది. అందరు ఊహించినట్లుగానే మురళీకృష్ణ గౌడ్ను తప్పించగా రాజుగౌడ్కు అవకాశం వరించింది. అప్పటికే రాజుగౌఢ్కు చైర్మన్ పదవి ఇవ్వాలని పార్టీ నేతలు ఎమ్మెల్యేను కోరారు. దీంతో జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు సైతం రాజుగౌడ్కు గ్రంథాలయ సంస్థ చైర్మన్గా నియమించాలని లేఖలు ఇచ్చారు. ఈ నేపధ్యంలో జిల్లా గ్రంథాలయ సంస్థ జిల్లా డైరెక్టర్ తో పాటు జిల్లా చైర్మన్ గా రాజుగౌడ్ను ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం చైర్మన్ గా ఉన్న మురళీగౌడ్ను డైరెక్టర్తో పాటు చైర్మన్ పదవి నుంచి తొలగించారు. మరోవైపు చైర్మన్గా నియామకమైన రాజుగౌడ్ మాట్లాడుతూ... తనకు పదవి అప్పగించిన ముఖ్యమంత్రి కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, జిల్లా ఇంఛార్జి మంత్రి సబితా రెడ్డి, ఎంపీ. రంజిత్ రెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ నియామకంకు మద్దతు తెలిపిన జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు డాక్టర్ ఆనంద్, రోహిత్ రెడ్డి, మహేష్ రెడ్డి, నరేందర్ రెడ్డిలకు సైతం కృతజ్ఞతలు తెలిపారు. తనపై విశ్వాసం ఉంచి జిల్లా గ్రంథాలయ సంస్కృ చైర్మన్ గా అవకాశం కల్పించిన తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిని మరోసారి ఎమ్మెల్యేగా గెలిపించడమే తన ముందున్న ప్రధాన లక్ష్యం అని రాజుగౌడ్ పేర్కొన్నారు.