schedule Saturday, September 05, 2026

వాహనదారులకు షాక్..!

calendar_today March 5, 2023
person dharshininews
వాహనదారులకు షాక్..!
వాహనదారులకు షాక్..! - టోల్ ట్యాక్స్ పెంచుతున్న కేంద్రం - ఈసారి ఎంతశాతం పెంచుతుందంటే దర్శిని ప్రతినిధి: దేశంలోని వాహనదారులకు కేంద్రం షాక్‌ ఇచ్చే నిర్ణయం తీసుకోబోతోంది. వచ్చే నెల నుంచి జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్ వేలపై ప్రయాణించే వారికి టోల్‌ ట్యాక్స్‌ను పెంచాలని యోచిస్తోంది. నేషనల్ హైవేస్ ఫీ రూల్స్ 2008 ప్రకారం ప్రతి సంవత్సరం ఏప్రిల్ 1న ధరలు సవరించాల్సి ఉంటుంది. అవసరాలను బట్టి సమయానుసారంగా టోల్ సమస్యలపై పాలసీ (Toll Tax Policy) నిర్ణయాలు తీసుకుంటూ వస్తోంది ప్రభుత్వం. మార్చి చివరి వారంలో రహదారుల అథారిటీ చేసే సిఫార్సులను ఉపరితల రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ పరిశీలించి ఏప్రిల్ 1న ప్రకటన చేయనుంది. ఈ విషయంపై నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (National Highway Authority of India - NHAI) టోల్ ట్యాక్సులను పెంచనుందని జాతీయ మీడియా పేర్కొంది. ఈ టోల్ ధరలు సుమారు 5 శాతం నుంచి 10 శాతం మేర పెరగనున్నాయని సమాచారం. అధికారవర్గాల సమాచారం ప్రకారం కార్లు (Cars), లైట్ వేట్ వెహికిల్స్‌కు టోల్ ఛార్జీలు (Toll Charges) 5 శాతం మేర పెంచే అవకాశాలు ఉన్నాయి. అలాగే హెవీ వాహనాలకు 10 శాతం పెంచనున్నారని తెలుస్తోంది. ఇటీవలే అందుబాటులోకి వచ్చిన డిల్లీ-ముంబాయి ఎక్స్‌ప్రెస్ వేకు సైతం టాలో రేట్లను పెంచనుంది కేంద్రం. ప్రస్తుతం డిల్లీ-ముంబాయి ఎక్స్‌ప్రెస్ వేపై కిలోమీటర్‌కు రూ.2.19 వసూలు చేస్తున్నారు. దానిని మరో 10 శాతం పెంచనున్నారు. దీనిపై వాహనాల సంఖ్య సైతం పెరుగుతోంది. ప్రతి రోజు 20 వేల వాహనాలు వెళ్తున్నట్లు సమాచారం. అది వచ్చే ఆరు నెలల్లో 60 వేలకు చేరే అవకాశాలు ఉన్నాయి. పాసులపై కూడ భారం తప్పదు నేషనల్ హైవేస్ ఫీ రూల్స్ 2008 ప్రకారం టోల్ గేటుకు సమీపంలో ఉన్న వారికి సైతం ఎలాంటి మినహాయింపులు లేవు. అయితే, 2022-23 ఆర్థిక ఏడాదిలో అన్‌లిమిటెడ్ ట్రిప్పులతో నెలకి రూ.315తో పాసులు ఇచ్చారు. టోల్ గేట్ ప్రాంతానికి 20 కిలోమీటర్ల పరిధిలో ఉన్న ప్రజలకు ఈ నెలవారీ పాసులు అందిస్తుంటారు. ఇప్పుడు వాటి ఛార్జీలు సైతం దాదాపు 10 శాతం పెంచే ఆలోచనలో ఉంది కేంద్రం. ఇప్పుడు పాసుల ధరలు సైతం పెంచనున్న నేపథ్యంలో నిత్యం టోల్ గేట్ ద్వారా సొంత పనులకు వెళ్లన వారికి మరింత భారం కానుంది.