schedule Sunday, July 05, 2026

తలక్రిందులుగా త్రివర్ణ పతాకం

calendar_today January 26, 2023
person dharshininews
తలక్రిందులుగా త్రివర్ణ పతాకం
తలక్రిందులుగా త్రివర్ణ పతాకం - గమనించకుండా ఎగురవేసిన ఆర్డీఓ - విస్తుత పోయిన అధికారులు, నేతలు తాండూరు, దర్శిని ప్రతినిధి: వికారాబాద్‌ జిల్లా తాండూరులో త్రివర్ణ పతాకం తలక్రిందులుగా ఎగిరింది. జిల్లా రెవెన్యూ అధికారి, తాండూరు ఆర్డీఓ అశోక్ కుమార్ గమనించకుండా జెండాను ఎగుర వేశారు. తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి సమక్షంలో ఈ సంఘటన జరిగింది. గురువారం గణతంత్ర దినోత్సవం సందర్భంగా మున్సిపల్ ఆధ్వర్యంలో పాత తాండూరులోని అంబేద్కర్ పార్కులో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి అధికార హోదాలో ఆర్డీఓ అశోక్ కుమార్ హాజరయ్యారు. అదేవిధంగా తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్‌, వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు, కౌన్సిలర్లు, పార్టీల నేతలతో కలిసి హాజరయ్యారు. అయితే నిర్ణీత సమయంలో ఆర్డీఓ అశోక్ కుమార్ జాతీయ జెండాను ఆవిష్కరించేందుకు సిద్దమయ్యారు. సిబ్బంది అందించిన తాడూ సహాయాంతో జెండా ఎగురవేయగా పైకి వెళ్లిన తరువాత జెండా తలక్రిందులుగా కనిపించింది. వెంటనే అప్రమత్తమై జెండాను కిందకు దించి సవరించిన తరువాత మళ్లీ ఎగురవేశారు. ఉన్నత స్థాయి అధికారి, ఎమ్మెల్యే సమక్షంలో జాతీయ జెండా తలక్రిందులుగా ఎగరవేయడం పట్ల అందరు విస్తుత పోయారు. అధికారి చేత జాతీయ జెండా తలక్రిందులుగా ఎగురడం జెండాకు అవమానం జరిగినట్లే అని అభిప్రాయాలను వ్యక్తం చేశారు.