schedule Monday, July 06, 2026

ఉచిత భోజన పథకం అసమంజసం

calendar_today July 6, 2026
person dharshininews
ఉచిత భోజన పథకం అసమంజసం
ఉచిత భోజన పథకం అసమంజసం - ప్రభుత్వం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి - ఉపాధ్యాయులకు పెండింగ్ బకాయిలు చెల్లించాలి - బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్ తాండూరు, దర్శిని ప్రతినిధి : ఉపాధ్యాయులకు ఉచిత భోజనాలు అందించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించడం అసమంజసమైన చర్య అని బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్ అన్నారు. సోమవారం ఆయన ఓ ప్రకటనలో మాట్లాడుతూ ఉపాధ్యాయులు, కాలేజీల బోధన, బోధనేతర సిబ్బందికి ఉచిత అల్పాహారం, మధ్యాహ్న భోజనం అందించాలని ప్రభుత్వం ఆలోచించడం పూర్తిగా అవాస్తవ ప్రాధాన్యతలకు నిదర్శనమని తీవ్రంగా వ్యతిరేకించారు. దాదాపు 430 ప్రభుత్వ కళాశాలల్లో చాక్‌పీస్‌లు, బోధనా సామగ్రి వంటి కనీస అవసరాలకే నిధులు లేక ఇబ్బందులు ఎదురవుతున్న పరిస్థితిలో, ఉచిత భోజన పథకానికి నిధులు వెచ్చించడం ఎంతవరకు సమంజసం? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆరు డీఏలు, పీఆర్సీ అమలు కాక, పెండింగ్ బకాయిలతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. వారికి రావాల్సిన వేతన ప్రయోజనాలు, డీఏలు, పీఆర్సీ, ఇతర బకాయిలు చెల్లించకుండా, ఉచిత భోజనాల పేరుతో కొత్త పథకాలు తీసుకురావడం సమస్యకు పరిష్కారం కాదన్నారు. బకాయిలు చెల్లిస్తే వారు తమ ఇంటి నుంచే భోజనం చేసి విధులకు హాజరవుతారని అన్నారు. ఉచిత అల్పాహారం, మధ్యాహ్న భోజనం అందించే ప్రతిపాదనను తెలంగాణ ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని, ఆ నిధులను ప్రభుత్వ విద్యా వ్యవస్థ బలోపేతానికి, పెండింగ్ బకాయిల చెల్లింపులకు వినియోగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. https://www.dharshininews.com/43694/